కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ కార్మికునిపై చెప్పులు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ అతనిపై సానిటరీ ఇన్ స్పెక్టర్ దాడి చేసిన ఘటన ఆందోళనకు దారి తీసింది. మంగళవారం సాయంత్రం దాడి జరగడంతో నేడు కార్మికులందరు పనులు బహిష్కరించి సానిటరీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం రోజున మున్సిపల్ కార్మికుడు శేఖర్ రోజు మాదిరిగానే చెత్త సేకరణ కోసం వెళ్ళాడు. ఓ ఇంట్లో చెత్త తీసుకుని అక్కడ ఉన్న చెప్పులను దొంగతనం చేశాడని సానిటరీ ఇన్ స్పెక్టర్ పర్వేజ్ కార్మికునికి ఫోన్ చేసి ఓ చోటకు రప్పించాడు. రాగానే అతనిపై ఇష్టానుసారం చేతితో కర్రతో దాడి చేశాడు. పక్కనే జేసిబితో పని నడుస్తుండటంతో జేసిబితో గుంత తవ్వి అందులో పాతి పెడతానని దుర్భాషలాడాడు.
అలాగే కులం పేరుతో దూషించాడని కార్మికుడు శేఖర్ తెలిపారు. ఈ విషయమై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో పర్వేజ్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నేడు సానిటరీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కార్మికులు.
మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా
సానిటరీ కార్యాలయం నుంచి దళిత సంఘాలు, సిఐటియు, సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. పర్వేజ్ ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. కార్యాలయానికి వచ్చిన కమిషనర్ దేవేందర్ ను గేటు వద్దనే అడ్డుకున్నారు కార్మికులు. పర్వేజ్ పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. సస్పెండ్ చేస్తానని కమిషనర్ చెప్పినా లిఖిత పూర్వకంగా సస్పెండ్ చేసినట్టు కాపీ చూపిస్తేనే ఆందోళన విరమిస్తామని కార్మికులు బైఠాయించారు.
విచారణకు అదేశించి చర్యలు తీసుకుంటాం
జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈతో విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ దేవేందర్ తెలిపారు. ఇద్దరిది తప్పని తేలితే ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు
ఆరోపణ అవాస్తవం
తనపై కార్మికుడు శేఖర్ చేస్తున్న ఆరోపణ అవాస్తవమని సానిటరీ ఇన్ స్పెక్టర్ పర్వేజ్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్మికులపై మొక్కలు నాటాలని ఒత్తిడి తేవడంతోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అతను దొంగతనం చేస్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో తనవద్ద ఉందని ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. అతడిని కొట్టలేదని, మండలించడం జరిగిందని తెలిపారు
సీసీ కెమెరాలో రికార్డ్
సంబంధిత కార్మికుడు శేఖర్ చెత్త ఉన్న బుట్టను తీసుకుని చెత్త వాహనంలో వేసిన అనంతరం అటూఇటూ చూస్తూ చెప్పులను తీసుకుని వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చిన్న దొంగతనానికి అంతలా కొట్టాల్సిన అవసరం ఏముందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.