రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా నిర్వహించే “రోజా చారిటబుల్ ట్రస్ట్” నేతృత్వంలో సంక్రాంతి, కొండచుట్టు ఉత్సవం సందర్బంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం లో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది.
తెలుగు వారి సాంప్రదాయంగా, అలంకరించిన ఎద్దుల బండిలో మంత్రి రోజా ప్రముఖ సినీ నటులు, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ తో కలిసి సభా వేదిక వద్దకు వచ్చారు. నగరి నియోజకవర్గం లోని మహిళలు వేసిన కనుల విందైన రంగురంగుల రంగవల్లులను మంత్రి సందర్శించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం నిండుగా చెరుకు గడల అలంకరణలతో, సాంప్రదాయ దుస్తులతో, గంగిరెద్దుల సవ్వడితో, కోడి పందేల జోరుతో పండుగ జోష్ ని పెంచారు. రాష్ట్ర మంత్రి రోజా స్వయంగా మహిళలకు మట్టి గాజులు వేసి, మెహందీ పెట్టి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశారు.
సంక్రాంతి సందర్బంగా పొంగళ్ళు పెట్టారు. అనంతరం చిలకజోష్యం స్టాల్ ను సందర్శించారు. చిన్నారుల కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హారికథా ప్రదర్శన అహుతులను ఆకట్టుకుంది. మంత్రి తన అత్త గారైన షణ్బగం పుట్టినరోజును పురస్కరించుకొని సభా వేదిక పై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆద్యంతం ఛలోక్తులతో మాట్లాడిన ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, ప్రముఖ నటులు అలీ చిన్నతనంలో తనకు వచ్చిన మొదటి బహుమతి లైఫ్ బాయ్ సోప్ గురించి చెప్పడం విశేషం. ఈ సందర్బంగా మంత్రి ఆర్.కే.రోజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏమి కావాలి అనేది ఇస్తున్నారని అన్నారు. నగరి కొండచుట్టూ మహోత్సవం లో 21మంది దేవుళ్ళు చక్కని అలంకరణలతో ఆశీర్వదిస్తారని తెలిపారు.
2004 వ సంవత్సరం నుంచి కొండ చుట్టూ ఉత్సవానికి హాజరవుతున్నానని, ప్రస్తుతం పర్యటక శాఖ మంత్రి గా హాజరువుతున్నానని ఆనందంగా చెప్పారు. భవాని ఐలాండ్ లో జనవరి 11నుంచి 16 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు గ్రామీణ వాతావరణం ను సృష్టించగా ప్రజలు తమ కుటుంబాలతో ఎంజాయ్ చేశారని చెప్పారు.
విజేతలకు బహుమతులు
ప్రధమ బహుమతిని( ఫ్రిడ్జ్)నగరి కి చెందిన విజయకుమారి, గిరిజ, రెండవ బహుమతిని (వాషింగ్ మెషిన్) పుదుపేటకు చెందిన తేన్మోలి, భవ్య, తృతీయ బహుమతిని(ఎల్.ఈ.డి టీవీ)గుడ్డి కండ్రిగకు చెందిన దివ్య, లక్కమ్మ కన్సలేషన్ బహుమతులుగా (ఫెడల్ ఫాన్స్) పుత్తూరు కు చెందిన వాణి, వందన, నగరికి చెందిన లత, సౌమ్య, వి.కే.ఆర్. పురానికి చెందిన విజయకుమారి, శాంతి, పుత్తూరుకు చెందిన ముత్తులక్ష్మి, నాగేశ్వరి, పుష్పంజలి, జమున, చిన్న తంగల్ కు చెందిన యమున, చందన కుమారి, చింతల పట్టేడకు చెందిన లక్ష్మి, సరస్వతి, నగరికి చెందిన గ్రేస్, సుజాత, గుండ్రజుకుప్పంకు చెందిన పార్వతి, చాందిని,లోకేశ్వరి, షాలిని లు సాధించారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ,తుడా సెక్రటరీ శ్రీలక్ష్మి, నగరి, పుత్తూరు మునిసిపల్, నగరి రూరల్, పుత్తూరు రూరల్, వడమల పేట, నిండ్ర, విజయపురం మండల ప్రజా ప్రతినిధులు,మునిసిపల్ కమీషనర్, వివిధ కమిటీల చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.