తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో రజక నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ లకు అన్యాయం చేసిందని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దాపురం భాస్కర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతూ నేడు కొల్లాపూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏవోకు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన రూ. 1,82,000 కోట్ల బడ్జెట్ లో ప్రధాన సేవకులైన రజక, నాయీ బ్రాహ్మణ కులాల ఫెడరేషన్ లకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. గత సంవత్సరాలలో ప్రభుత్వం 450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, అందులో కేవలం 32 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.
జీవో నెంబర్ 190 ప్రకారం 32 కోట్ల లో ఐదువేల మందికి 50 వేల చొప్పున 50 వేల మందికి మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బీసీ నాయకులు గా పేరొందిన మంత్రులు ప్రకటనలు చూస్తే అర చేతిలో బెల్లం పెట్టి మోచేతి దాకా నాకమంటున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించిన నిధులు వివిధ పద్దుల కింద ఖర్చుపెట్టి, వాస్తవాలను కప్పిపుచ్చి కల్లబొల్లి మాటలను చెబుతున్నారని ఆయన అన్నారు.
రజక, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ ను కేటాయించక పోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బి లక్ష్మణ్, టి,సత్యనారాయణ, కురుమూర్తి, రాముడు తదితరులు పాల్గొన్నారు.