సరూర్నగర్లో కారుకు ఘోర పరాభవం తప్పలేదు. ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సరూర్నగర్, ఆర్కేపురంలలో కమలాన్ని తక్కువగా అంచనా వేయడం, పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి కారెక్కడం, కరోనా నేపథ్యం, వరదల సహాయం అందించే విషయం మీనమేషాలు, తమ పార్టీ నేతలకు, అనుచరగణాలకే ప్రాధాన్యతనివ్వడం ఈ విషయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మంత్రికి సైతం నిరసనల సెగ తగలడం లాంటి అనేక విషయాలు ఆయా చోట్ల టీఆర్ఎస్ వైఫల్యానికి కారణాలుగానే చెప్పొచ్చు.
తీగలకు అప్రాధాన్యతే ఓటమికి కారణమా?
ఇక్కడ మరో అపవాదు ఏంటంటే సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లు మంత్రికి అచ్చిరావనే వాదనా ఉంది. ఇక గతంలో తీగల ప్రాతినిథ్యం వహించిన మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన సబితమ్మ కాస్త తీగల వర్గానికి ప్రాధాన్యతను కల్పించకపోవడం కూడా ఇక్కడ గులాబీ పార్టీని ఓటమి పాల్జేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుతో విసిగి వేసారిన తీగల క్రష్ణారెడ్డి కారునొదిలి కమలం వైపు వెళ్ళేందుకు పూర్తి రంగం సిద్ధం చేసుకోగా, మంత్రి మల్లారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆయనకు భరోసా కల్పించారు. అయినా కూడా తీగల వర్గం కాస్త సబితా ఇంద్రారెడ్డి చేత తీవ్ర అణచివేతకు గురైందనే అభిప్రాయం, అపవాదు ఉంది. పలుమార్లు ఈ విషయంలో తీగల ముఖ్య అనుచరులు కూడా ఆయనవద్ద ఈ పంచాయితీని తీసుకువచ్చి కన్నీరుమున్నీరయ్యారని తద్ఫలితంగానే తీగల పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని అధిష్టానం నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని అందరికీ తెలిసిందే.
భవిష్యత్ నిర్ణయాలేంటో?
దీంతో తీగల వర్గం కాస్త ఇక్కడ సబితా ఇంద్రారెడ్డికి సహకరించకపోవడం కూడా చాలావరకూ టీఆర్ఎస్ ఓటమికి కారణమైందనే చెప్పాలి. ఏది ఏమైనా మొత్తానికి ఉన్న రెండు స్థానాల్లోనూ కారును గెలిపించడంలో విఫలమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి భవిష్యత్లో టీఆర్ఎస్ పటిష్టతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది, రాజకీయ నిర్ణయాలు ఏముంటాయోననేది వేచి చూడాల్సిందే.