కమలం పార్టీ ఈ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకొని తమ సత్తా చాటింది. జీహెచ్ఎంసీలో అత్యంత పెద్దదైన కార్పొరేషన్ మైలార్దేవ్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోదరుడు ప్రేమ్దాస్ గౌడ్ రంగంలో నిలవగా, బీజేపీ తరఫున తోకల శ్రీనివాస్రెడ్డి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి సానేం శ్రీనివాస్ గౌడ్ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మైలార్దేవ్పల్లిలో అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతోబాటు ఆయా పార్టీల్లో గలాటాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాతీర్పు మాత్రం బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడ్డికి అనుకూలంగా వచ్చి ఆయనను కార్పొరేటర్ పీఠం ఎక్కించింది. తొలుత నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం అయిన శ్రీనివాస్రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది.
అత్యుత్సాహం, ఆరోపణలే టీఆర్ఎస్ కొంపముంచాయా?
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోదరుడు ప్రేమ్దాస్గౌడ్ కూడా ఈ స్థానం నుంచి రంగంలోకి ఉన్నా ప్రచారంలో ఏ మాత్రం ఆకట్టుకోక పోవడం, అదీగాక ఎప్పుడూ టీఆర్ఎస్ చేస్తున్న పనులను మాత్రమే ఊటంకించడం, మరోవైపు ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఇంకోవైపు ఇటీవలే మైలార్దేవ్పల్లిలోని ఓటర్లు అధికంగా కలిగిన ఓ వర్గం ప్రచార నిమిత్తం వెళ్ళిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాస్త నోరు జారడం వీరి ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. సదరు ప్రచారంలో తోకల ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నందునే తాను ఈ డివిజన్లో పనులు చేపట్టడం లేదని పేర్కొన్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి డివిజన్లో వేరే పార్టీకి చెందిన వ్యక్తి కొనసాగుతుంటే ఆ డివిజన్ ప్రజలందరినీ ఒకే గాడిన కట్టి వారిని దూరం పెడుతున్నారనే సంకేతాలను ఆయన ఇయ్యకనే ఇచ్చారు. దీంతో ఈయన ఓటమి ఇక్కడ నిశ్చితమైందనే అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తమైంది. నేడు ఫలితాలు ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి.
ఆ మూడూ కమల దళానికే!
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గంలోని మరో రెండు కార్పొరేషన్ స్థానాలను కూడా ఇలాగే జార విడుచుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రనగర్ స్థానాన్ని సైతం బీజేపీ అభ్యర్థి పొదవు అర్చనా కైవసం చేసుకున్నారు. ఇక అత్తాపూర్ ఫలితాల్లో కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా మోంద్ర సంగీత కమలానికి విజయాన్ని అందజేశారు.
నోరు జారీ.. అపజయాన్నిమూటగట్టుకొని!
మొత్తానికి ఎమ్మెల్యే నోరు జారడం కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కావడంతోనే ఈ అపజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, మరోవైపు ఇటీవలే బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడ్డికి, ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య మైలార్దేవ్పల్లిలో పెద్ద గొడవే జరిగింది. రూ. 40 లక్షలు పట్టుకోగా, ఎమ్మెల్యే తన అనుచరులతో వెంట వచ్చి దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. ఈ సంఘటన జరిగిన రెండవ రోజే ఎన్నికలు జరగడంతో ప్రజలంతా ఆయా విషయాలను నిశితంగా గమనించి బీజేపీకి బ్రహ్మరథం పట్టారు.
దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్ రాజకీయ బలాబలాలపై టీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.