కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణం లో ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు. బత్తిని కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా,దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున హైదరాబాద్ లో చేప మందు వేస్తుంది.
కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం తో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు. ఏటా దేశ విదేశాల నుంచి వేలాది మంది చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని, ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తక్షణం తమకు గానీ పోలీసు వారికి గాని తెలియచేయాలని బత్తిని హరనాథ్ గౌడ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపారు.