వేల పిడికిళ్లు బిగుసుకున్నాయి
ఒక్క గొంతు మాత్రమే
వందేమాతరం అంటూ పొలికేక పెట్టింది
లక్షల మంది గుసగుసలాడుతున్నారు
తర్జన భర్జనల పుంజీతం ఆడుతున్నారు
ఒక్క పాదమే ముందుకు నడిచింది
దారి దీపమై నిలిచింది
దశాబ్దాల కాలం నుంచి అంతటా నినాదాలే
దున్నేవాడిదే భూమి అని..
ఒక్క పచ్చ సంతకం
కూలీని పట్టాదారుణ్ని చేసింది
భూ సేవకునికి పట్టాభిషేకం చేసింది
నిపుణఉలందరూ ముక్త కంఠంతో అన్నారు
జనాభా భారమని..
జనం మన నకడకు ఆటంకం అని..
ఒక్క మేధస్సు మాత్రమే
అదే మన బలం అనీ మనకు వరం అనీ వాదించింది
మానవ వనరుగా నిరూపించింది
జ్తానులందరూ మనుషులను సమూహాలుగా చేసి
భాషల గోడలను అడ్డంగా కట్టేశారు
అతనొక్కడే భాషతో వారధిని నిర్మించాడు
దీవుల మధ్య సంధానమై నిలిచాడు
సృజనకారులందరూ
అనువాదాలు తొలి అనుభవాలు కాదన్నారు
ఒక్క కలం మాత్రం
సహస్రఫణుల నవేతిహాసాన్ని సృష్టించింది
శతాధి ఫణతుల అనుభూతులను మిగుల్చింది
అంతర్జాతీయ బేహారులందరూ
దేశం పనైపోయిందని
బంగారం తాకట్టులో పడిందని ఎగతాళి చేశారు
ఒక్క చాణక్య నీతి
నూతన ఆర్ధిక అస్త్రాలను సంధించింది
దేశ శిరస్సుపై కిరీటాన్ని పదిలంగా నిలబెట్టి
ప్రపంచ పద్మవ్యూహాన్ని ఛేదించింది
ఆ ఒక్కడు
ఎప్పటికప్పుడు ముందుతరం దూతనే
కాలాన్ని అధిగమించిన క్రాంత దర్శినే
ఒ ఒక్కడు
ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే
చట్టం చేసే పనిని నమ్మిన తాత్వికుడే
అతడు
మట్టిని మానవత్వాన్ని
పరుశవేదిలా మలిచిన రుషి
తెలంగాణా తనానికి భారతీయ తత్వానికి
వంతెన వేసిన రాజర్షి
ఐనంపూడి శ్రీలక్ష్మి, సెల్ నెం:9989928562
1 comment
ఐనంపూడి శ్రీలక్ష్మి గారి కవిత చదువుతుంటే
శ్రీ పి.వి. నరసింహారావు గారి జీవితం మొత్తం ఆకళింపు చేసుకుని మనకు అందమైన పదాలలో అందించిన అనుభూతి. అద్భుతంగా రాసారు హృదయపూర్వక అభినందనలు అందుకోండి