కార్తిక శుద్ధ విదియను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వివిధ వర్ణాల గాజులతో దుర్గమ్మను అలంకరించారు. ఏటా పది లక్షలకుపైగా గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తుంటారు. కానీ ఈసారి కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దాతల నుంచి విరాళంగా వచ్చిన రెండు లక్షల గాజులతో ఆలయ ప్రాంగణం వరకే అలంకరణ చేశారు.
ఈ అలంకరణ కోసం మహిళలు గాజులను దండలుగా చేశారు. గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులను అనుమతించారు. అమ్మవారికి పసుపు కుంకుమ, గాజుల సమర్పించి పూజించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనంతోపాటు మల్లేశ్వరస్వామిని దర్శించుకొని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. కార్తిక శుద్ధ విదియ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని లింగపురాణం ప్రస్తావించింది. క్రమంగా ఇదే ‘భగినీ హస్త భోజనం’ పేరుతో ఆచారంగా స్థిరపడింది.