నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఇ సంస్థ హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో నేడు జరిగిన ఎస్.సి, ఎస్.టి అభ్యర్థుల సాంకేతిక శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర కార్మిక, ఉపాధి, సాంకేతిక శిక్షణ అభివృద్ధి శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎస్.సి, ఎస్.టి హాబ్ పథకం క్రింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యువత కు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ (NI-MSME) సంస్థ వారు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ & ప్రీ సేల్స్ ఎనలిస్ట్, కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ వృత్తులలో సుమారు 300 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది.
మంత్రి మల్లారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్.సి, ఎస్.టి యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువత కు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చిన చిన్న ఉద్యోగంలో చేరినప్పటికీ మరల ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తాను కూడా చిన్న స్థాయి నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని ఆలాగే శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్.సి, ఎస్.టి యువత కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం దేశంలోనే అతిపెద్ద ఉద్యోగకల్పనా భాండాగరమని, నైపుణ్యం ఉంటే ఉద్యోగాలకు కొదవ లేదని తెలిపారు. శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు పొందిన వారికీ నియామక పత్రాలను, ధృవ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గ్లోరీ స్వరూప, అడిషనల్ కమీషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ కల్లెపు హరిత, ఫ్యాకల్టీ మెంబెర్స్ డాక్టర్ విజయ, డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి, ఇంకా, సాంకేతిక శిక్షకులు పాల్గొన్నారు.