తెలంగాణ కు ద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతే కాదు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఏ కాంగ్రెస్ నాయకుడు సలహా ఇచ్చినా అలా సలహా ఇచ్చిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని ఆ సిద్ధాంతం ప్రకారం పని చేసేవారే పార్టీలో ఉండాలని, అలా చేయలేని వారు పార్టీని వదలి వెళ్లాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీపై సానుభూతి ఉన్నవారు దయచేసి కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లోకో, బీజేపీలోకో వెళ్లిపోవాలని రాహుల్ గాంధీ సలహా ఇచ్చారు.
వరంగల్ లో నేడు జరిగిన రైతు సభలో ఆయన ఎంతో ఆవేశంగా మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పని చేయడంలేదని ఆయన కేవలం ఒక రాజులాగా పని చేస్తున్నాడని రాహుల్ గాంధీ అన్నారు. రైతులకు అందాల్సిన డబ్బులను లూటీ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ ఈ విషయాలు వెల్లడిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. టీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉండదని రాహుల్ గాంధీ ప్రకటించినప్పుడు సభలో విశేష స్పందన రావడం గమనార్హం.