ఏలూరు జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభించిన ఓటర్ల జాబితా పరిశీలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇంటింటా సర్వే కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ల జాబితా పరిశీలనపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా పరిశీలనలో ఎటువంటి సమస్యలు వచ్చిన వాటిని తప్పక పరిష్కరిస్తామని అన్నారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ రోజునుండి నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారం-6,7,8 ల రోజువారీ నివేదికలను తీసుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి జాబితా ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నాయా, చనిపోయినవారు, వలసవెళ్లిన వారు పేర్లను గుర్తించడంతోపాటు కొత్తగా ఓటుహక్కుకోసం ధరఖాస్తుచేసుకున్న వివరాలను పక్కాగా చేయాలన్నారు.
ఒకే డోర్ నెంబరులో ఎక్కువ ఓటర్లు ఉన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక డోర్ నెంబరులో శాశ్వతంగా ఓటరు వేరే ప్రాంతానికి వెళ్లిన పక్షంలో సంబంధిత నోటీసు జారీ చేయాలని ఎవరూ లేనిచో గోడకు అంటించాలని ఆ సమయంలో వారు స్పందించని సమయంలో ప్రక్కనున్న ఇంటివారితో సాక్ష్యం తీసుకొని ఆ ఓటరు పేరును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి మంగళవారం నియోజకవర్గ స్ధాయిలో ఇఆర్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. అదే విధంగా ప్రతి బుధవారం జిల్లాస్ధాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటరు శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లినా ప్రస్తుత చిరునామాలో ఉన్న ఓటును తొలగించి వారు నివశిస్తున్న ప్రాంతంలో క్రొత్తగా ఓటుహక్కును పొందవచ్చన్నారు.
ఈ విషయంపై సంబంధిత ఓటర్లకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితా, నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను పకడ్బందీగా నూరుశాతం పూర్తి చేయడంలో రాజకీయ పక్షాలు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి, ఎస్. భరత్ రావు(బి.ఎస్పీ), బొద్దాని శ్రీనివాస్(వై.ఎస్.ఆర్.సిపి), ఎస్. అత్స్యుతబాబు(టిడిపి), సిహెచ్ సురేష్ బాబు(ఆమ్ ఆద్మీపార్టీ), యం. ధశరధ కుమార్, తదితరులు పాల్గొన్నారు.