చికిత్స లేదనుకున్న ఎయిడ్స్ వ్యాధి నుంచి మరొకరికి విముక్తి లభించింది. లండన్ పేషంట్ గా ఇంతకాల మారు పేరుతో పిలిచిన ఇతని అసలు పేరు ఆడమ్ కాస్టిల్లీజో. 40 ఏళ్ల ఈ వ్యక్తికి 2003 లోఎయిడ్స్ వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఆడమ్స్ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు.
అతనికి చికిత్స అందించే వైద్యులు విశ్రాంతి లేకుండా చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆడమ్స్ పై పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్ఐవి గుర్తించిన తర్వాత అతనికి హాడ్కిన్ లింఫోమియా వచ్చింది. 2012 నుంచి ఈ వ్యాధికి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత 2016లో బోన్ మ్యారో (ఎముక మజ్జి) క్యాన్సర్ వచ్చింది.
అదృష్ట వశాత్తూ ఆడమ్స్ కు ఒక దాత ఎముక మజ్జి దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. దాత నుంచి ఎముక మజ్జి తీసి ఆడమ్స్ కు ఎక్కించారు. ఆ చికిత్సను కూడా విజయవంతంగా చేశారు. మార్చిన బోన్ మ్యారో కూడా హెచ్ ఐ వి కి లోను కావాలి కానీ అలా జరగలేదు. యాంటీ రిట్రో వైరల్ మందులు పని చేయడం ప్రారంభించాయి.
యాంటీ రిట్రో వైరల్ మందులను 18 నెలల కిందట నిలిపివేసి పరీక్షలు జరిపారు. అతని రక్తం, బ్రెయిన్ ఫ్లూయిడ్, అన్నవాహిక కణజాలం, లింఫ్ కణజాలం అన్నింటిని రెగ్యులర్ గా పరీక్షిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని రకాల వైరస్ లను అతని డిఎన్ఏ లో కనుగొన్నారు. అయితే అవి ప్రమాదకరమైనవి కాదని పరీక్షలలో తేలింది. ఇప్పుడు ఆడమ్ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ప్రపంచంలో లక్షలాది మంది ఎయిడ్స్ తో జీవిస్తుండగా వారిలో ఒకరికి ఇలా హెచ్ఐవి నుంచి విముక్తి కలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. అందుకే ఇప్పుడు ఆడమ్ ను అంబాసిడర్ ఆఫ్ హోప్ (ఆశావహ జీవితానికి రాయబారి) గా పిలుస్తున్నారు.