ప్రభుత్వ సేవల్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. అయితే సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ల మధ్య అనేక చోట్ల సమన్వయం కొరవడుతోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో గల 20 సచివాలయాల్లో సుమారు 160 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 390 మంది వాలంటీర్లు విధుల్లో వున్నారు. పలు సచివాలయాల్లో ఉద్యోగులు తమ వ్యక్తిగత పనుల్ని వాలంటీర్ల చేత చేయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కంప్యూటర్ వర్క్ కూడా మేమే చేయాలా?
ఉద్యోగులు చేయాల్సిన కంప్యూటర్ వర్క్ సైతం వాలంటీర్ల చేత చేయిస్తున్నారని అంటున్నారు. పట్టణంలోని 8 వార్డు వీవర్స్ కాలనీలోని 5 వ సచివాలయ పరిధిలో పలువురు వాలంటీర్లు తమ గోడువెళ్లబుచ్చుతున్నారు.
ఓ ఉద్యోగి తమను బానిసల్లా చూస్తున్నారని, ప్రతీ రోజూ అవసరం లేకున్నా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ సచివాలయంలో తన వద్ద ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో తప్పని సరిగా వాలంటీర్లు ప్రింగర్ ప్రింట్ అటెండెన్స్ వేయాలనే నిబంధన ఉందని గుర్తు చేస్తున్నారు.
అయితే వారం పొడవునా సచివాలయాలకు రావాల్సిందేనని షరతు విధించారని ఉద్యోగులు చేయాల్సిన పనుల్ని సైతం తమ చేత చేయించటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఆ ఉద్యోగి చెప్పినట్లు వినకపోతే అటెండెన్స్ తీసి వేస్తానని, జీతం కట్ చేస్తానంటూ ఆ ఉద్యోగి బెదిదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పడే ఇబ్బందుల్ని గతంలో రెండు సార్లు కమీషనర్ దృష్టికి తీసుకెళ్లామని ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఉద్యోగి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
దీని వల్ల ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటున్నారు. వచ్చే రూ.5 వేల వేతనానికి వాలంటీర్ గా విధులు అయితే చేస్తాం కానీ దురుద్దేశంతో హింసిస్తే భరించలేమని, ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
జేసికి ఫిర్యాదు
కాగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని లిఖిత పూర్వకంగా గుంటూరు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు గురువారం తెలిపారు. ఆరు మంది వాలంటీర్ల సంతకాలతో సదరు ఫిర్యాదు కాపీని రూపొందించారు. విచారించి తమ సమస్య పరిష్కారం అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కాపీ ద్వారా కోరారు.