ఔషధ మొక్కల్లో నాణ్యత పెంచేందుకు స్వచ్ఛంద ధృవీకరణ అవసరమని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మహేష్ పాండే పేర్కొన్నారు. విశాఖపట్టణంలో విన్సర్ పార్క్ హోటల్లో జాతీయ మెడికల్ ప్లాంట్స్ బోర్డ్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యములో శనివారం గిరిజన ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ పాండే మాట్లాడుతూ ఔషధ మొక్కలు సంప్రదాయ వైద్యానికి, మూలికా పరిశ్రమకు ఒక ప్రధాన వనరుగా అభివర్ణించారు. వీటిని ఒక పద్ధతి ప్రకారం సేకరించి, స్వచ్చంద దృవీకరణ పొందితే మేలైన అటవీ ఉత్పత్తులు రావడమే కాకుండా గిరి రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కోవెల్ సీఈఓ కృష్ణారావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఔషధ మొక్కలను అడవుల నుంచి సేకరించడమే కాకుండా వ్యవసాయ భూముల్లో సాగుచేస్తున్నారు. అయితే వీటి విలువ హెచ్చింపునకు సరైన విధానాలు అవలంబించక పోవడం వల్ల గిరిజనులు ధర విషయంలో నష్టపోతున్నారన్నారు.
కన్సల్టెంట్ బృందావనం మాట్లాడుతూ అడవీ ఉత్పత్తులను సరైన విధానంలో సేకరించక పోవడం వల్ల రైతులు 20 శాతం నష్టపోతున్నారన్నారు. వంద మొక్కలను అడవుల నుంచి తీసినట్టయితే 55 మొక్కలు వృధాగా పోతున్నాయన్నారు. వీటి తయారీలో సైతం సరైన విధానాన్ని అవలంబించక పోవడం తక్కువ ధర పలుకుతోందన్నారు.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించేందుకు స్వచ్ఛంద దృవీకరణ అవసరమన్నారు. ఏయూ రిటైర్డ్ బోటనీ ప్రొఫెసర్ దాసు మాట్లాడుతూ ఔషధ మొక్కలు, అవి మానవ జాతికి ఉపయోగపడుతున్న తీరును వివరించారు. కార్యక్రమంలో అనంతగిరి మండలంలో చింతపాక, బంగారయ్యపేట ఉత్పత్తి దారుల సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.