అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నేడు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ, ఆర్డీవో , మున్సిపల్ చైర్మన్ తులసీరామ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నందున నియోజక వర్గ ప్రజలు సహకరించి స్వీయ నిర్బంధం లో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
ఏమైనా సమస్యలు ఎదురైతే తనకు వ్యక్తి గతంగా ఫోన్ లో తెలియచేయాలన్నారు. తన కోసం క్యాంపు కార్యాలయానికి రాకూడదని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధం లో మనమందరం భాగస్వాములై గెలుపొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యక్తి గత పరిశుభ్రత తో పాటు సామాజిక బాధ్యత ను నెరవేర్చాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు.