మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హోం మంత్రి సుచరిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై గుంటూరు జిల్లా నకరికల్లు మండల పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.
సెక్షన్ 188 కొవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన, సెక్షన్ 270 వ్యాధి విస్తరణకు పాల్పడుతున్నారని, సెక్షన్ 504 ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అవమానించడం, సెక్షన్ 505(2) వదంతులు వ్యాప్తి చేసి వ్యక్తి పరువుకు నష్టం కలిగిస్తున్నారని, సెక్షన్ 509 మహిళలను కించపరచడం, 51(బీ) ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా కించపరచడం, డీఎంఏ-2005 విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ఉల్లంఘన, వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.