రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దెబ్బకు ఏపి బీజేపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవలె కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. దాంతో విష్ణుకుమార్ రాజు కూడా పార్టీ వీడుతున్నారని వార్తలు బయటకు వచ్చాయి.
విష్ణుకుమార్ రాజుతో బాటు పలు జిల్లాల బీజేపీ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కోవలోకే సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధీశ్వరి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన కామెంట్స్కు పురంధేశ్వరి కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. రంగా విషయంలో జీవీఎల్ కామెంట్స్ చేయగా.. ఎన్టీఆర్ , వైఎస్ఆర్ గురించి పురంధేశ్వరి ప్రస్తావించారు. కన్నా తరువాత ఏపీ బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరి కూడా ఉంటారా ?
ఒకవేళ ఉంటే వాళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే విధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేశ్ కూడా బీజేపీని విడిచి పెట్టబోతున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నందున టీ జీ వెంకటేశ్ బీజేపీ నుంచి వైదొలగుతున్నారని అంటున్నారు.
మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కూడా సోము వీర్రాజు బాధితులే. టీ జీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నాయకులను కూడా సోము వీర్రాజు చాలా సందర్భాలలో అవమానించారు. వారికి పార్టీ వ్యవహారాలు ఏవీ తెలియపరచకుండా సోము వీర్రాజు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న నాయకులను ఆపేందుకు బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం.