పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా వైఎస్ షర్మిల ఖమ్మం టూర్ వాయిదా పడింది. ఈ నెల 21న భారీ ర్యాలీగా ఖమ్మం పట్టణానికి వెళ్లి, అక్కడ తన మద్దతుదారులతో సమావేశం కావాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె తన టూర్ ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి షర్మిల టూర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ప్రారంభమై, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కట్ పల్లి, సూర్యాపేట, పాలేరు మీదుగా ఖమ్మం వరకూ సాగాల్సి వుంది.
దారిపొడవునా షర్మిలకు స్వాగత ఏర్పాట్లు చేయాలని, ఆమె అభిమానులు ప్లెక్సీలను కూడా సిద్ధం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తరువాతనే ఖమ్మం వెళ్లి, అభిమానులను కలవాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు సమాచారం.