పోలీసులను కొట్టి అరెస్టు అయిన వై ఎస్ షర్మిలకు తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ సంఘీభావం వ్యక్తం చేయలేదు. దాంతో షర్మిల రాజకీయంగా తెలంగాణ సమాజంలో ఒంటరి అయిన విషయం స్పష్టం అవుతున్నది. గతంలో ఒక సారి పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్టు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను పరామర్శించారు. అంతే కాకుండా జాతీయ మీడియా షర్మిల అరెస్టును పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఈ సారి ఆమెకు సంఘీభావం వ్యక్తం చేసిన వారే కరవయ్యారు. షర్మిల పోలీసులను కొట్టడాన్ని ఎవరూ సమర్థించలేదు.
షర్మిల అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చినా కూడా ఎక్కడా ఎలాంటి స్పందన లేదు. రాయలసీమ నుంచి వచ్చి తెలంగాణ లో రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల చాలా కాలం పాటు పాదయాత్ర చేశారు. పాదయాత్రలలో ఎంతో నైపుణ్యం, గత అనుభవం ఉన్న షర్మిల అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను వ్యక్తిగతంగా దూషించినా ఎవరూ పట్టించుకోలేదు.
ఒకటి రెండు చోట్ల స్థానిక బీఆర్ఎస్ నాయకుల నుంచి ప్రతిఘటన వచ్చినా ఎందుకోగానీ రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం షర్మిలను విమర్శించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు ఆయన తీవ్రంగా ప్రతిఘటించగా దాన్ని మరింత రచ్చ చేసేందుకు షర్మిల ప్రయత్నించారు. అయితే అది కూడా సమసి పోయింది. ఇలా షర్మిల చేసిన ఏ ప్రయత్నం ఫలించకపోవడం, తెలంగాణ లో ఆమె పార్టీకి ఏ మాత్రం ఆదరణ దొరక్కపోవడం ఆమెను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది.
షర్మిల బీజేపీతో ఎన్నికల పొత్తు పెంటుకుంటారని అందరూ అనుకున్నా కూడా ఆమె బీజేపీ నాయకులను కూడా పెద్ద ఎత్తున తిడుతూ వారికి దూరం అయ్యారు. కేసీఆర్ పై విమర్శలు చేయడం, రేవంత్ రెడ్డిని చులకనభావనతో మాట్లాడటం తదితర వ్యవహారాలతో షర్మిల తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలకూ దూరం అయ్యారు. ప్రస్తుతం ఆమె అరెస్టును ఏ పార్టీ ఖండించకపోవడం, ఆమెకు సంఘీభావం ప్రకటించకపోవడం, ప్రజల నుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంతో షర్మిల రాజకీయ జీవితం ఇక తెలంగాణ లో ముగిసినట్లేనని భావిస్తున్నారు. పులివెందుల మార్క్ రాజకీయాలకు తెలంగాణ లో ఏ మాత్రం ఆదరణ ఉండదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.