వితంతు, ఒంటరి మహిళలు కలలను సాకారం చేసుకోవడానికి గతాన్ని మరిచిపోయి జీవితాన్ని సరళతరం చేసుకుంటూ ముందడుగు వేయాలని నిజామాబాద్ కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం డైరెక్టర్ సంద బాబు సంపాదకత్వంలో వెలువడిన వితంతు మహిళా కవిత్వం
చెమట నది పుస్తకాన్ని అందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతకాలపు మూస దృక్పథాలను పాతరేసి మెరుగైన జీవనోపాదులను ఎంపిక చేసుకొని మనుగడ సాగించాలని కోరారు. సాధారణ మహిళల కంటే మేమేమి తక్కువ కాదని ఆత్మస్థైర్యంతో విజయబావుటా ఎగురవేయాలని కలెక్టర్ సూచించారు.
వితంతు ఒంటరి మహిళలపై ఉన్న వివక్షతను పారద్రోలడంలో సాధారణ మహిళలు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వితంతు ఒంటరి మహిళలకు మనోధైర్యాన్ని కల్పించి, నూతన ఒరవడిని సృష్టించడానికి చెమటనది పుస్తకం దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు.