11a గనిలో పంపు ఆపరేటర్ గా పని చేస్తున్న కొడం సంజీవ్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గని లోపలే మరణించినా సింగరేణి ఉన్నతాధికారులు, 11 ఏ గని అధికారులు స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తించారని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా సమితి తీవ్రంగా ఖండించింది. సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెస్క్యూ సిబ్బందితో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి ఉంటే కోడం సంజీవ్ మరణించి వుండేవాడు కాదని ఏఐటీయూసీ అభిప్రాయపడింది.
మామూలు కార్మికుడే కదా అని ఉన్నత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం మూలంగానే అతను మరణించాడని ఆరోపించారు. నామమాత్రంగా గత 11 రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టడం, సర్వే డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ గని డిజైనింగ్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమని వారన్నారు.
కార్మికుడు మిస్సింగ్ అయిన వెంటనే డి జి ఎం ఎస్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు అయితే ఇంత ఆలస్యమైఉండేది కాదని ఏఐటీయూసీ అభిప్రాయపడుతోంది. ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి వెంటనే గని అధికారులను సస్పెండ్ చేసి.. హై కోర్ట్ సిట్టింగ్ న్యాయ మూర్తి తో విచారణ జరిపించి సంజీవ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం కోటి రూపాయలు ఒకరికి ఉద్యోగం కచ్చితంగా ఇవ్వాలని ఏఐటీయూసీ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. సంజీవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నామని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి రాజారత్నం, నగర కార్యదర్శి శనిగల శ్రీనివాస్, ఏఐటియుసి నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్ తెలిపారు.