రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మారిషస్ దేశంలో తిరుమల సీజర్ మైల్ ప్రాంతంలో ఉన్న హరిహరదేవస్థానం నేతృత్వంలో మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మొట్టమొదటి సారిగా మహారుద్రయాగం నిర్వహిస్తున్నట్లు హరిహర దేవస్థానం చైర్మన్ ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య బృందావనం పార్ధసారధి స్వామీజీ తెలిపారు.
మారిషస్ ద్వీపంలోని హిందూ బంధువులందరినీ ఒకే చోటకు చేర్చాలన్న సదుద్దేశంతో మారిషస్ దేశంలోనే మొట్ట మొదటి సారిగా అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ మహారుద్రయాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మారిషస్ దేశంలో ఉన్న సనాతన ధర్మ టెంపుల్ ఫెడరేషన్, హిందూ మహా సభ, టూకే అమ్మ టెంపుల్, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
అలాగే యాగానంతరం మార్చి 6వ తేదీన సామూహిక అభిషేకం, హోమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మారిషస్ దేశంలో ఉన్న హిందువులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు చెప్పారు.