ప్రపంచ దేశాలను కరోనా పట్టి పీడిస్తుంటే వ్యాపారులు ప్రజలను పట్టిపీడిస్తున్నారు. ప్రజలు వారి వారి పనులు మానుకొని ఇంట్లో ఉండిపోయారు. జీతాలు లేక సంపాదన లేక ఆర్థికంగా నష్టపోతూ ఉంటే వ్యాపారులు మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఇదే అవకాశమని కొందరు వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు ధరలు పెంచేశారు. హోల్ సేల్ మార్కెట్ ల వారు ఇస్తున్న రేట్లకు గ్రామీణ ప్రాంతాలకు వచ్చే సరికి రేట్లు దాదాపు 20 రెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఎంఆర్ పి రేటును మరచ్చిపోయి ఏ రేటు పడితే ఆ రేటు చెబుతున్నారు.
రిటైల్ వ్యాపారుల పాలిట వరం కరోనా
కరోనా రిటైల్ వ్యాపారుల పాలిట వరంగా మారింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిత్యావసర సరుకులు వాళ్లకు తోచిన విధంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. బ్రాండ్ కూడా చూడటం లేదు. వారు ఏది ఇస్తే అది తీసుకోవాలి. సంబంధిత అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
అసలే పనులు లేకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది అని అంటున్నారు ప్రజలు. ఏ కిరాణా షాప్ కి వెళ్ళిన రేట్లు పెంచి వస్తువులు ఇస్తున్నారని లేదంటే మా దగ్గర సరుకు లేదని పంపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తూనికలు కొలతల శాఖ అధికారుల జాడే లేదు
ప్రభుత్వ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే సాగుతోందని సెలవిస్తున్నారు. తూనికల కొలతల శాఖ జాడే లేదు. కిరాణా షాప్ లో యజమానులను రేట్లు ఎందుకు పెంచారు అని అడుగగా వ్యాపారి ఒకరు మాకు హోల్ సేల్ వాళ్ళు రేట్లు పెంచి ఇస్తున్నారు అందువల్లనే మేము కూడా రేటు పెంచక తప్పడం లేదని అంటున్నారు. అలాగే డేట్ ఎక్స్ పైర్ అయిన సరుకులు నాణ్యతలేని సరుకులు అంటగడుతున్నారు.