ఎన్నికలు ఉంటేనే నల్గొండ జిల్లా కేసీఆర్కు గుర్తుకు వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఘన విజయంతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ సన్నాహాక సమావేశం గురువారం నల్లగొండలో జరిగింది ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నల్గొండ జిల్లా మీద కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.
ఉప ఎన్నికలు ఉంటేనే ఇక్కడకు వచ్చి హామీల వర్షం కురిపిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం తధ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం తను చేపట్టనున్న పాదయాత్రను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతన్న మీదప్రేమ ఉంటే ఎందుకు 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు మంజూరుచేయట్లేదని ప్రశ్నించారు. నాగార్జున సాగర్లో ఓట్ల కోసమే 2వేల కోట్లతో లిఫ్ట్ పనులు అంటూ కొత్త నాటకాలకు తెర లేపుతున్నాడని విమర్శించారు.
ఇక్కడనే కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు ఆ పనులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉద్యమం కాళేశ్వరం కంటే ముందు మొదలు పెట్టిన డిండి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ హామీలు ఇచ్చి తరువాత వాటిని మర్చిపోవడం కేసీఆర్కు అలవాటేనని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ2001 నుండి తెలంగాణా ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన రాములు నాయక్ ఉన్నారని గుర్తచేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఎన్నిసార్లు నల్గొండ పట్టణానికి వచ్చాడో చెప్పాలన్నారు. కేసీఆర్ కు బ్రోకర్ లాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పనిచేస్తుంటే రాములు నాయక్ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడని వివరించారు. కాబట్టి రాములు నాయక్ భారీ మెజార్టీతో గెలిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నల్లగొండ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ , మాజీ పిసిసి అధ్యక్షుడు వి. హనుమంతరావు,మాజీ మంత్రి బలరాం నాయక్ ,రాంరెడ్డి దామోదర్రెడ్డి ,నల్లగొండ మాజీ జెడ్పీటీసీబాలునాయక్, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ,
సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ,నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ,జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపి సుమన్ ,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ,పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండలపార్టీ అధ్యక్షులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.