అంబులెన్సులో రోగులను తీసుకెళ్తున్నట్టు నమ్మిస్తూ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న అడవిదొంగల ముఠా గుట్టును స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుట్టు రట్టు చేసారు. ముందుగా అందిన సమాచారం మేరకు తిరుపతి కేంద్రంగా పనిచేసే టాస్క్ ఫోర్స్ కడప సబ్ కంట్రోల్ నుంచి ఆర్ఐ చిరంజీవి టీమ్ లోని ఆర్ఎస్ఐ రాఘవేంద్ర బృందం బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా కనిపించాడు.అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో, అతన్ని వెంట తీసుకుని ముందుకు వెళితే. అక్కడ ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో కొందరు ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్నారు.
దీంతో వారిని చుట్టుముట్టగా ఏడుగురు పట్టుబడ్డారు. మరో నలుగురు పారిపోయారు. వారిని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకుని బెంగుళూరుకు, అక్కడ నుంచి ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం, గుత్తి మీదుగా తిరుపతి చేరుకుని, అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి పంపించారని తేలింది.