రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ నందు గ్రామీణ పంచాయతీ నీటి సరఫరా అధికారులతో పలు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో జరిగే పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. రాబోయే వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు కొరకు ముందుగానే నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి తాగునీటి సమస్యపై నాకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా 5,412 త్రాగు నీటి కుళాయి పనులు వారం రోజుల లోపల పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 4.18 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సామూహిక మరుగుదొడ్లు నిర్మాణం పనులు 803 పనులకు ఆమోదించడం జరిగిందని, ఇందులో 703 పనులు చేపట్టడం జరిగిందని, ఈనెలాఖరు లోపల పనులు పూర్తిచేయాలన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఈ శ్రీరాములు, ఈ ఈలు జీవి రాజారావు, డి రామారావు, సంబంధిత శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.