విజయనగరం రైల్వే స్టేషను, స్టేషను ఔటర్లులోను, రైలుల్లోను నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. గవర్నమెంట్ రైల్వే పోలీసు (జి.ఆర్.పి), రైల్వే పోలీసు ఫోర్సు (ఆర్.పి.ఎఫ్) అధికారులతో జిల్లా ఎస్పీ ఎం. దీపిక తన ఛాంబర్ లో సమావేశమై, రైల్వే స్టేషను, స్టేషను ఔటర్లులోను, రైలుల్లోను నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ కార్యచరణలో జి.ఆర్.పి., ఆర్.పి.ఎఫ్., మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా పాల్గొంటారన్నారు. ఇటీవల కాలంలో రైలుల్లో ప్రయాణిస్తూ, ఫుట్ బోర్డుల వద్ద కూర్చొని లేదా నిలుచున్న ప్రయాణికుల సెల్ ఫోనులు చూస్తుండగా కొంతమంది ఆకతాయిలు వారి చేతుల్లోని మొబైల్ ఫోనులను కర్రతో కొట్టి, క్రిందపడగొట్టి, మొబైల్ ఫోన్లును కాజేస్తున్నారు.
అదే విధంగా ఔటర్లులో ఆగిన రైలు బండ్లలోకి ఆకతాయిలు ప్రవేసించి, బోగిలోని చార్జింగు పెట్టిన సెల్ ఫోనులు, ల్యాప్ టాప్లను కాజేస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. జి.ఆర్.పి., ఆర్.పి.ఎఫ్., మరియు జిల్లా పోలీసులతో ఏర్పడిన ఈ ప్రత్యేక బృందాలు ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతాయన్నారు.
ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు సంయుక్తంగా ట్రెయిన్ బీట్లు, గస్తీ, ట్రోలింగు ముమ్మరం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, నేరాల నియంత్రణలో భాగంగా ఆకస్మికంగా చేపట్టి, రైలుల్లోను, స్టేషను ఔటర్లులో అనుమానస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, విచారణ చేయడం, వేలి ముద్రలను సేకరించడం, వారి బ్యాగులను తనిఖీ చేయడం చేస్తామన్నారు.
విచారణలో వారు పాత నేరస్థులుగా నిర్ధారణ అయితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా ఈ తరహా నేరాలకు క్రొత్తగా పాల్పడే వారి వేలిముద్రలను సేకరించి, వారిపై కూడా చట్ట పరిధిలో చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ సమావేశంలో ఎస్బీ సిఐ కే.కే. వి. విజయనాధ్, జి.ఆర్.పి. ఎస్ఐ వి. రవివర్మ, ఆర్.పి.ఎఫ్. ఎస్ఐ బి. శ్రీధర్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.