ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం హైదరాబాద్ లో నియామకపత్రం అందించారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి క్రిష్ణమూర్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ కు చెందిన గంజి శ్రీనివాస్ కార్మికుల పక్షాన పని చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన జాతీయ కమిటీ.. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోని అసంఘటిత, సంఘటిత కార్మికులను ఏకం చేస్తూ, యూనియన్ సభ్యత్వాన్ని 2 కోట్లు చేసేందుకు ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయ ప్లీనరీలో నిర్ణయించామన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం విక్రయానికి పెడుతుందని, దీనిపై దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం వినోద్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, రాధా కృష్ణయ్య, టీపీసీసీ సెక్రెటరీలు బండి సుధాకర్, యాదగిరి, జీవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.