తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజున నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జరుగుతుంది. ఈ ఏడాది ఈ ఉత్సవాలు జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆలయ ముఖ మండపంలో జూన్, 25, 26, 27వ తేదీల్లో ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
అదేవిధంగా రాత్రి 7.00 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వామివారిని మొదటిరోజు పెద్దశేష వాహనంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.