శ్రీశైల మహా క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కర్నాటక నుంచి భక్తులు రాలేకపోయారు. సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఆంక్షలు సడలించడంతో ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు కాలినడకన క్షేత్రానికి తరలివస్తున్నారు.
దేవస్థానం అధికారులు నెల రోజులుగా క్రితం నుంచి కర్నాటక రాష్ట్రానికి వెళ్లి దర్శన సమయాలు, ఆలయ నిబంధనలను వివరించినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా దేవస్థానం ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్సవాలు జయపద్రంగా విజయవంతమవుతున్నాయి. ఈ సారి అంచనాలకు మించి భక్తులు వస్తుండడంతో దర్శనాలు కల్పించడం సైతం కష్టంగా మారిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేయగా.. కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నారు. దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులు వాగ్వాదం, ఘర్షణలకు దిగుతూ.. కంపార్ట్మెంట్లను ధ్వంసం చేస్తున్నారు.
కాలినడకన క్షేత్రానికి చేరుకున్న వారంతా దర్శనానంతరం తిరుగుప్రయాణమవుతూ తమ ప్రాంతాలకు చెందిన బస్సులే కావాలంటూ టోల్గేట్ వద్ద మూడు గంటల సేపు రాస్తారోకో చేశారు. సుమారు ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థానం అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు రావొద్దు : ఈవో
కర్నాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామి వారి దర్శనానికి ఇప్పుడే రావొద్దని దేవస్థానం ఈవో లవన్న విజ్ఞప్తి చేశారు. ఉగాది ఉత్సవాలు ముగిసిన తర్వాత మాత్రమే రావాలని కోరారు. కర్నాటక నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండడంతో మరో నాలుగు రోజుల వరకు రద్దీగానే ఉంటుందని అన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు పలు ఆర్జితసేవా టిక్కెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు