ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తి కేసుతో దాడి చేసిన కేసులో నిందితుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు సంచలన విషయాలు వెల్లడించాడు. కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చార్జ్ షీట్, కౌంటర్ తో పాటు జనిపల్లి శ్రీనివాసరావు స్టేట్ మెంట్ ను జత చేశారు. జనిపల్లి శ్రీనివాసరావు స్టేట్ మెంట్ లో తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని పేర్కొన్నాడు.
జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, తనపై హత్యాయత్నం తెలుగుదేశం పార్టీ కుట్ర అని ఎన్నికల ముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు చెప్పిన మాటలు అసత్యాలని NIA నిన్న కోర్టులో వెల్లడించింది. తాజాగా జనిపల్లి శ్రీనివాసరావు అప్పుడు ఇచ్చిన స్టేట్ మెంట్ బయటకు వచ్చింది. తాను జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు జనిపల్లి శ్రీనివాసరావు తెలిపాడు.
ప్రజల్లో సానుభూతి కోసం జగన్పై అటాక్ చేశాను. దీని ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించా. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా. జగన్కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన చిరునవ్వు చిందించారు అని జనిపల్లి శ్రీనివాసరావు వెల్లడించాడు.
అయితే అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు తనపై దాడి చేశారని, పోలీసులు తనను కాపాడి ఓ గదిలో బంధించారని అతను తెలిపాడు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించారు. అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను బాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను.
కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు. ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు. జగన్కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డాను అని జనిపల్లి శ్రీనివాసరావు తన స్టేట్ మెంట్ లో చెప్పాడు.