ప్రముఖ జర్నలిస్టు, కొప్పరపు వేంకట కవుల మనుమడు మాశర్మను నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సన్మానించారు. విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ విజయవాడ కాంగ్రెస్ పార్టీ భవనం 108 సంవత్సరాల నాటిది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు కొప్పరపు కవులకు అత్యంత ఆత్మీయులు. కొప్పరపు కవులు ఎప్పుడు విజయవాడ వెళ్లినా విడిది చేసిన ఇళ్లల్లో కాళేశ్వరరావు గారి ఇల్లు ప్రధానమైంది.
నందిగామలోనూ వారింట్లో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయ్యదేవరగారింట్లో ఏ వేడుక జరిగినా కొప్పరపు కవుల అవధాన/ ఆశుకవితా సభ తప్పకుండా ఉండేది. 1936లో విజయవాడలో కాంగ్రెస్ మహాసభలు జరిగిన సందర్భంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కొప్పరపు కవులు కాళేశ్వరరావుగారింట్లో తారసపడ్డారు. నెహ్రుకు కొప్పరపు కవులను కాళేశ్వరరావుగారే పరిచయం చేశారు. నెహ్రుగారి కోసం కొప్పరపువారు సంస్కృతంలో ఆశుకవితా ప్రదర్శన చేశారు. కొప్పరపువారి ప్రతిభకు నెహ్రుగారు అబ్బురపడి బహుధా ప్రశంసించారు. ఈ ఘట్టాలన్నీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి ‘ఆత్మకథ’లో అక్షరబద్ధమై ఉన్నాయి.
భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య పంతులు, టంగుటూరు ప్రకాశంపంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, కాశీనాథుని నాగేశ్వరావుపంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి స్వాతంత్ర్య సమరయోధులతో కొప్పరపు కవులకు ఎంతో అనుబంధం ఉండేది. వారంతా సారస్వత ప్రియులు. అది గొప్పకాలం! విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ లో శాలువా కప్పి సత్కరిస్తున్న సమయంలో ఇవన్నీ మాశర్మ మననం చేసుకున్నారు.