కరోనా కష్ట కాలంలో నవరత్నాలను తాత్కాలికంగా వాయిదా వేసి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి పైసా ప్రజల ప్రాణాలను కాపాడటానికి సద్వినియోగం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి అనేక గ్రామాలలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు.
ఈ సమయంలో వారిని కరోనా నుంచి బయట పడేసే మార్గం చూడకుండా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో రైతు భరోసా క్రింద (3,928,88) మూడువేల తొమ్మిది వందల 28 కోట్లు ఖర్చు చేయడం కన్నా ఆ నిధులతో రైతుల ఆరోగ్యానికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు భరోసా నిధులతో రాష్ట్రంలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఆసుపత్రి నిర్మించండి 20 పడకలు ఏర్పాటు చేయండి ఒక డాక్టర్ ఐదు మంది నర్సులతో పాటు ఆక్సీజన్ కాన్సంట్రేటర్ లను కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి రైతులు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడండి అని ఆయన కోరారు.
వైఎస్సార్ రైతు భరోసా క్రింద ప్రతి రైతుకి ప్రభుత్వం ఇస్తున్న 7,500 లతో వైరస్ సోకిన రైతు కనీసం ఆ గ్రామం నుంచి పట్టణానికి రావాలంటే అంబులెన్స్ బాడుగకు కూడా చాలదు,దురదృష్ట వశాత్తు రైతు కానీ వారి కుటుంబ సభ్యులు చనిపోతే దహన సంస్కారాలకు కూడా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా చాలదు! రైతులకు ఇచ్చే రైతు భరోసా నిధులతో ఆ మండలంలోని అందరికీ వైద్య సదుపాయాలు కల్పించి ప్రాణదాతగా నిలవండి అని ఆయన కోరారు.