విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి, ఉన్నత శిఖరాలు చేరాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “బాలల దినోత్సవం” కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి కొరకు దాతలు ముందుకు రావాలని ఆమె తెలిపారు. వివిధ దశలలో సహకరిస్తున్న వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, వనపర్తి జిల్లా నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందించటం జరిగిందని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధన తప్పనిసరి చేసిందని, ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగాలని ఆమె సూచించారు. నీట్, ఎంసెట్ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆమె తెలిపారు.
విద్యార్థులు పౌష్టికాహారం భుజించాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆమె సూచించారు.
అంతకుముందు “బాలల దినోత్సవం” సందర్బంగా మణిగిళ్ళ జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ గదిని జడ్పీ ఛైర్మెన్ లోకనాథ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. 2 లక్షల రూపాయలతో కంప్యూటర్ లను అందించిన ఎన్.ఆర్. ఐ. బాలిరెడ్డి తండ్రిని ఆమె సన్మానించారు. విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుడి మేఘా రెడ్డి, వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎం.పి.డి. ఓ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, పాఠశాల హెడ్మాస్టర్ పలుస శంకర్ గౌడ్, సిబ్బంది, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్