మున్నేరు ముంపు బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి నిత్యావసర వస్తువులను అందించాలని, వరద ముంపుకు గురైన వారికి తక్షణ సహాయంగా రూ. 20వేల ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆయన కోరారు.
మున్నేరు ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మంచికంటి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాలలో సిపిఐ బృందం పర్యటించింది. ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అర్ధరాత్రి మున్నేటి వరద ఉద్ధృతి పెరగడంతో సర్వం వదిలేసి ప్రాణాలతో బయటపడ్డామని పలువురు సిపిఐ బృందం ఎదుట వాపోయారు.
ప్రభుత్వం ఆదుకునేలా ప్రయత్నించాలని సీపీఐ బృందానికి విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ మున్నేటి వరడ పలు కాలనీల్లో బీభత్సం. సృష్టించిందన్నారు. మంచినీటి సరఫరాను తక్షణం ట్యాంకుల ద్వారా చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మురుగు పేరుకుపోయిందని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హేమంతరావు తెలిపారు.
మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బందిని ముంపు ప్రాంతాలలో మోహరించి తక్షణ చర్యలు చేపట్టాలని హేమంతరావు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నగర కార్యదర్శి ఎస్కే జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, నాయకులు పోటు పూర్ణచందర్రావు, సైదా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.