ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై స్పష్టతనివ్వాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసిఎల్) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నేడు కేసు విచారించిన జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
2015 సంవత్సరంలో శ్రేయా సెహగల్ కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ను కొట్టేసిందని అయినా పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని ఆయన అన్నారు.
ఈ సెక్షన్ ను కొట్టివేసిన తర్వాత కూడా దేశంలోని చాలా రాష్ట్రాలలో వేలాది కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది సంజయ్ పారిక్ సుప్రీంకోర్టుకు తెలిపారు.