అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళల వైవాహిక స్థితిపై ఆధారపడి ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటే ఆమె వివాహితురాలా లేక అవివాహితా అనే అంశాలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 24 వారాలలోపు అబార్షన్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఈ చారిత్రాత్మక నిర్ణయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హక్కులో స్త్రీ పెళ్లయిందా లేదా అవివాహితురా అనేది పట్టింపు లేదు. అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కును హరించడానికి మహిళ వైవాహిక స్థితిని ఒక కారణం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాలలో ఈ చట్టం ప్రకారం ఒంటరి మరియు అవివాహిత స్త్రీలకు కూడా అబార్షన్ చేసే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.