లఖీమ్పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది.
యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. లఖీమ్పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు.