పేదల అభ్యున్నతితో పాటు గ్రామీణ యువత, మహిళల సాధికారత కోసం స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి భారతి పవార్ తెలిపారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆమె, ఈరోజు ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ ను సందర్శించారు. ట్రస్ట్ లో అందిస్తున్న వివిధ కోర్సులు, శిక్షణార్థులు అభ్యసిస్తున్న తీరు, భవిష్యత్ అవకాశాలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్ ఆమెకు ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలను గురించి తెలియజేశారు. ప్రత్యేకించి ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వివిధ కోర్సుల గురించి తెలియజేశారు. శిక్షణార్థుల వసతి, భోజనశాల, క్రీడలు- వ్యాయామ సౌకర్యాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. యువత, మహిళలకు సాధికారతను అందించే అనేక కోర్సులను ఉచితంగా అందించడమే గాక, వారికి వసతి ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ శిక్షణా సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ సందర్శన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకుండా సేవాతత్పరత కలిగిన వ్యక్తుల సహకారంతో నిర్వహిస్తున్న స్వర్ణభారత్ లాంటి సేవా సంస్థను సందర్శంచడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఇలాంటి సంస్థల ఏర్పాటు ద్వారా, గ్రామీణ భారతాన్ని సాధికారత దిశగా నడిపించి, నవభారత నిర్మాణాన్ని త్వరితగతిన సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహకులను, ఇతర సిబ్బందిని అభినందించారు. శిక్షణార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.