జగన్ ప్రభుత్వంపై నిన్న తీవ్ర విమర్శలు చేసిన రాజగురువు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 24 గంటల్లో క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఉద్దేశ్యం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని స్వరూపానందేంద్ర నేడు వివరణ ఇచ్చారు. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై నిన్న స్వరూపానందేంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
‘‘ఈ సంవత్సరం అంతా చెత్తగా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైంది. భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగారు. ఈ సంవత్సరం అధికారులు గానీ, ఎవరు గానీ మమల్ని అడగలేదు. పోలీసుల ఇష్టారాజ్యం అయిపోయింది. భక్తులకు చేరువగా భగవంతుడు ఉండే పరిస్థితి లేదు. ఆరు నెలల కంటే పైగా ఇక్కడ ఈవో లేకపోవడం దారుణం. ఇంత పెద్ద క్షేత్రాన్ని ఒక్క ఇంచార్జ్తో నడపడం ఏమిటి? భక్తుల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు.
అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. గర్భాలయంలో ఏ మాత్రం ఆచారం, సంప్రదాయం లేకుండా అయిపోయింది. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పొచ్చు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూస్తే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. అసలు ఈరోజు నేను ఎందుకు దర్శనానికి వచ్చానా? అని అనిపించింది అంటూ నిన్న తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామి నేడు క్షమాపణ చెప్పుకున్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న బాధతో మాట్లాడాను అంటూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రభుత్వ పెద్దలకు వివరణ ఇచ్చుకున్నారు. తాడేపల్లి నుంచి స్వామికి వార్నింగ్ వెళ్లడం వల్లే ఈ విధంగా ఆయన క్షమాపణలు చెప్పుకున్నారని అంటున్నారు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడవద్దని, తక్షణమే వివరణ ఇవ్వాలని తాడేపల్లి నుంచి కఠినమైన ఆదేశాలు రావడంతో స్వరూపానందేంద్ర ఒక్క సారిగా క్షమాపణలు చెప్పి నేడు వివరణ ఇచ్చుకున్నారు.