సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ప్రాంతీయ వైద్య శాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి కోవిడ్ బాధితులకు ఆహార పొట్లాలు, పండ్లు బ్రెడ్లు, పంపిణీ చేశారు. అనంతరం వైద్యశాలను సందర్శించి రోగులతొను, వైద్య సిబ్బంది, డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ వంద పడకల వైద్యశాలలో సిటీ స్కానింగ్ సెంటర్ తక్షణం ఏర్పాటు చేయాలని, వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరా నిల్వలు ఉంచాలని, వైద్యానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తదనంతరం మాజీ ప్రధాని,భారత రత్న, స్వర్గీయ రాజీవ్గాంధీ 30వ,వర్ధంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణం లోని రాజీవ్ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 1944 ఆగస్ట్ 20న, జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారతదేశ ప్రధానిగా సేవలందించారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న, తమిళనాడులోని పెరంబదూర్లో ఎల్టీటీఈ కి చెందిన ఆత్మాహుతి దళం చేతిలో దారుణ హత్యకు గురయ్యారని అన్నారు.
అతి పిన్న వయసులోనే భారతదేశ యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాజీవ్గాంధీ అని అన్నారు. దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారని, పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చారని, ఐటి, కమ్యూనికేషన్ రంగాల ఆవశ్యకతను ముందుగానే ఊహించారని గుర్తు చేశారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా,INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,జక్కుల మల్లయ్య, మేళ్లచెరువు ముక్కంటి,రామరాజు,ఎస్.కె. సైదా,వల్లపుదాసు కృష్ణ, కొళ్లపూడి యోహాన్,కోల మట్టయ్య, పోతుల జ్ఞానయ్య,ధనమూర్తి,పున్నయ్య,కస్తాల ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.