తమకు ప్రభుత్వం నుంచి మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మహిళలు రోడ్డెక్కితే దానికి బాధ్యులను చేస్తూ ఏపీఎంలపై ప్రభుత్వం వేటు వేయడం సిగ్గుమాలిన చర్య అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన శ్రీనిధి, అభయహస్తం, వడ్డీ లేని రుణాలకు సంబంధించి 52 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై వంటలు చేసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మహిళా సంఘాల సభ్యులు రోడ్డెక్కితే ఏపీఎంలపై వేటు వేసిన ప్రభుత్వం రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రోడ్డెక్కితే దానికి బాద్యులైన రెవిన్యూ మున్సిపల్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వేలాది మంది మహిళలు రోడ్డెక్కిన ప్రభుత్వం స్పందించక పోవటం విచారకరమన్నారు. మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు పడే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. మహిళా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందక ముందే ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, అప్పటి వరకు మహిళల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.