కాస్త సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారుతారు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఎప్పటిలాగే చేను బాట పట్టారు. రెండో శనివారం సెలవు కావడంతో వ్యవసాయ పనులకు వెళ్లారు.
ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్న గుంటూరుపల్లికి చెందిన బానోత్ సమ్మయ్య – జ్యోతి దంపతుల మిరప తోటకు వెళ్ళి కూలీలతో కలిసి మిరపకాయలు కోశారు. మధ్యాహ్నం మహిళ కూలీలతో కలిసి అన్నం తిన్నారు. రోజంతా పని చేసినందుకు గాను వచ్చిన కూలీ డబ్బులు రూ.250తో మరికొన్ని కలిపి మరొకరికి అందించారు.
వారంతా సెలవులో ఇలా వ్యవసాయ పనులు చేయడం వచ్చిన కూలీ డబ్బులతో పేదలకు సాయం చేయడం తస్లీమా ప్రవృత్తిగా భావిస్తారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు, వాదోడుగా నిలుస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. కూలీలతో మమేకమై వారితో కలిసి పని చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.