శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో నేటి నుండి 11.02.2023 నుండి 21.02.2023 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ మహాశివరాత్రి పండుగ రోజులలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా దైవదర్శనానికి తరలివస్తారని దీనికి సంబంధించి, ముఖ్యంగా 17.02.2023 నుండి 19.02.2023 వరకు విజయవాడకు వెళ్లవలసిన భారీ వాహనాల రాకపోకలు ఎటువంటి అవాంతరాలు లేని విధంగా మళ్లిస్తున్నట్లు తెలిపారు.
వాహనాల రాకపోకల దృష్ట్యా కర్నూలు పట్టణం లోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి ఆత్మకూరు – దోర్నాల మీదుగా విజయవాడకు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. కావున వాహనదారులు గమనించి లారీలు, భారీ గూడ్స్ వాహనాలు 17.02.2023 నుండి 19.02.2023 వరకు కర్నూలు పట్టణంలో గల నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవలసిందిగా తెలియజేశారు.