తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపు బాటలో పరుగెడుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తెలిపారు. నాలుగు లక్షల మెజారిటీ సాధిస్తామని చెప్పుకునే వైకాపా ఓటమి దిశలో పయనిస్తోందని ఆయన అన్నారు.
ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య జరిగే బహుముఖ పోటీలో టిడిపి అభ్యర్థి డాక్టర్ పనబాక లక్ష్మి అందరిలో మేటిగా నిలుస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. గత ఎన్నికల ఫలితాలను ఆయన ఇలా విశ్లేషించారు: గత ఎన్నికల ఫలితాలు, పలు రాజకీయ అంశాలను పరిశీలిస్తే ఇక్కడ టిడిపి గెలుపు ఖాయమని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ఇక్కడ వైకాపా అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి పై 2,28,376 ఓట్ల ఆధిక్యత సాధించారు. అలాగే లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియాజకవర్గాలు వైకాపా వశమయ్యాయి. దీనికి అనేక కారణాలు తోడయ్యాయి. జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరడం, కేంద్రం మెడలు వంచి హోదా తెస్తాననడం బాగా ప్రభావం చూపాయి.
అలాగే బిజెపి, ఇతర పార్టీలు లోపాయకారిగా జగన్ కు మద్దతు ఇవ్వడం వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది. జగన్ మాట నిలుపుకోక పోవడంతో ప్రజలు నిజాలను గ్రహించారు. రాజధాని మార్పు, విశాఖ ఉక్కు అమ్మకం, అభివృద్ధి ఆగిపోవడం,ఇసుక కొరత, దళితులపై దాడులు లాంటి అనేక అంశాలు జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలుగా పరిణమిస్తున్నాయి.
తిరుమల శ్రీవారి వ్యవహారాలు ప్రభుత్వానికి కళంకంగా మారాయి. గత ఎన్నికల్లో పరోక్షముగా వైకాపాకు మద్దతిచ్చిన బిజెపి పట్టుదలతో పోటీలోకి దిగుతున్నందున వైకాపా ఓట్లు గణనీయంగా చీలుతాయి. అలాగే ఈసారి కాంగ్రస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా పోటీ పడుతున్నందున వైకాపా సాంప్రదాయ ఓట్లు ఎక్కువగా చీలిపోతాయి.
ఈ రెండు పార్టీలు చెరో లక్ష ఓట్లు చీల్చిన టిడిపి గెలుపు నల్లేరుపై నడకవుతుంది. కాగా టిడిపి ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది, పైగా ఇప్పుడు పెరిగింది. గతంలో లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపికి మెజారిటీ ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో టిడిపి శ్రీకాళహస్తి, సత్యవేడు, వేంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట ఐదు నియోజకవర్గాలలో విజయం సాధించింది.
కాగా తిరుపతిలో పీఆర్పీ, సర్వేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో టీడీపికి 29,311ఓట్లు మెజారిటీ వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఆ ఎన్నికల్లో టిడిపి లోక్ సభ అభ్యర్థి వర్ల రామయ్య 19,276 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో టిడిపి తిరుపతి శ్రీకాళహస్తి, సత్యవేడు, వేంకటగిరి, నాలుగు చోట్ల, వైకాపా గూడూరు,సూళ్లూరుపేట, సర్వేపల్లి మూడు స్థానాలలో గెలిచాయి. అప్పట్లో మొత్తం పోలైన ఓట్లలో టీడీపికి 40,764 ఓట్లు మెజారిటీ వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో పొత్తుతో పోటీచేసిన బిజెపి అభ్యర్థి కారుమంచి జయరామ్ 37,425 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
దీనికి పలు అంతర్గ లోపాలను కారణాలుగా చెప్పవచ్చు. కేంద్ర ఎన్నిక కమీషన్ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికల్లో జగన్ దౌర్జన్యాలు,అధికార దుర్వినియోగం సాగదు. ఈ అన్ని విషయాలను విశ్లేషిస్తే టిడిపి గెలుపు ఖాయమని తేలిపోతుంది అని ఆయన విశ్లేషించారు.