తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. నాలుగో రోజు స్వామి, అమ్మవార్లు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి.అనంత, దుష్మంత్ కుమార్ దాస్, సిఇ రమేష్రెడ్డి, పరకామణి డెప్యూటీ ఈవో వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.