తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశానుసారం కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో శనివారం రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు.
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ టీడీపీ కార్యకర్తలు కలసి ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా 33000 ఏకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను మరచిపోయి రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాయలసీమ అభివృద్ధికి ఏ రకంగానూ ఉపయోగం లేని హైకోర్టును కేటాయించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనను ప్రజలు గమనించాలన్నారు. గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతుల పైన అక్రమ కేసులను బనాయిస్తూ, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పాస్పొర్టులను రద్దు చేసిన ఈ ఆరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
పాలన మొత్తం అమరావతి నుండే సాగుతున్నా రాజధాని అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసిపి నేతలు ఆ గ్రాఫిక్స్ భవనాల పై నుండి దూకగలరా? అంటూ ప్రశ్నించారు. ఆదాయ వనరులున్న రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే చరిత్ర లో నిలుస్తారని లేక పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ నిరాహారదీక్ష లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు,పట్టణ అధ్యక్షుడు సంజీవరావు,మందా శ్రీను,పోలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.