తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుయస్ )ములుగు జిల్లా ఆధ్వర్యంలో నేడు స్థానిక జడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాల నందు సర్వసభ్య సమావేశం జరిగింది. శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిపియుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత్ సురేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఉద్యమాల కార్యచరణ చేసారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా చల్లగోండ పద్మాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిగా ఆకుల శేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగా సమస్యల సాధనకై ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆర్.పి.సి కమిటీ వేసి వెంటనే మద్యంతర భృుతిని ప్రకటించాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి (ఓపిఎస్) పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు అవకాశం కల్పించాలని స్పౌజ్ ఆపేళ్ళ జీవో అమల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రతి పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో టిపియుఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల ముందు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 19వ తేదీన ఇందిరాపార్క్ ముందు రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత్ సురేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ జిల్లా, భూపాలపల్లి జిల్లా నాయకులు మాచర్ల బిక్షపతి, దాత మహర్షి, సంగం శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, మహేందర్ లతోపాటు ములుగు జిల్లా సీనియర్ నాయకులు సైకం శ్రీనివాసరెడ్డి, బాణాల సుధాకర్, ఎడ్ల సంపత్, గోనె రవీందర్, సదయ్య, కొత్తపల్లి పోషన్న, ఉప్పనూతుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.