ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో వైరా నియోజకవర్గ సెక్టార్ అధికారులకు అదనపు కలెక్టర్ ఎన్నికల నిర్వహణ విషయమై రెండవ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణను సద్వినియోగం చేసుకొని విధులు సమర్థవంతంగా చేపట్టాలన్నారు.
సెక్టార్ అధికారులు రిటర్నింగ్ అధికారులకు కేటాయించబడతారన్నారు. సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారికి క్షేత్ర స్థాయిలో కళ్ళు, చెవుల వాటి వారన్నారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తారన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని వసతులు, ఓటర్లకు అనుకూలతలు పరిశీలించాలని అన్నారు.
తమ పరిధిలోని ప్రాంతంలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. బూత్ లెవల్ అధికారులు, తహసీల్దార్, ఎంపిడివో, ఎస్హెచ్ఓ లను పరిచయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించి, సమస్యలు చర్చించాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమని, ఎన్నికలకు ఎలక్టోరల్, ఇవిఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమని కలెక్టర్ అన్నారు. ప్రతి ఎన్నికలు క్రొత్తగానే చూడాలని, ఏ దశలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదని, ప్రతి దశను సీరియస్ గా తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఇవిఎం ల నిర్వహణ పై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించి, ఇవిఎం లపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు.