ప్రాథమిక ఉపాధ్యాయుల జీతాలు చెల్లించే బాధ్యతలను ఎంఇఓ ల నుండి తొలగించి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు మారుస్తూ జారీ చేసిన అసంబద్ధ ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్పిటిఎ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రాత్లవత్ రోహిత్ నాయక్ డిమాండ్ చేశారు. జిఓ 40, 70 ల ప్రకారం యధాతథంగా ఎంఇఓ లకే ఆ అధికారాన్ని పరిమితం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ నశీర్ అధ్యక్షతన జరిగిన దృశ్య, శ్రావణ విధానంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్తర్వులు వల్ల హెడ్మాస్టర్ లకు పెనుభారం గా మారిందని, ఉన్నత పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుందని ఆయన అన్నారు.
నూతన విద్యా విధానం పటిష్టంగా ఉండాలి
అందులో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నలుమూలల విస్తరించి ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా మారిందని, దానిని పరిగణలోకి తీసుకొని ఎన్.సి.ఆర్.టి, వైద్య నిపుణులు,విద్యావెత్తలు, ఉపాధ్యాయ సంఘాల సూచనలు,సలహాలు తీసుకుని విద్యా సంస్థలను కొత్త విద్యా సంవత్సరాన్ని నిర్ధిష్టమైన ఏర్పాట్లు, సమగ్ర కార్యాచరణతో ప్రారంభించాలని లేనిపక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలకు రక్షణ ఉండదని ఆయన తెలిపారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయి
ప్రతి పాఠశాలలో కరోనా వైరస్ నుంచి రక్షణకు, నిరంతర శానిటేషన్ నిర్వాహణ అనివార్యం అయిందని, ప్రాథమిక పాఠశాలలకు అదనపు ఏర్పాట్లు అవసరం అవుతాయని, దానికి ప్రత్యేకంగా సిబ్బంది నియామకం, రక్షణ పొందడానికి ప్రత్యేకంగా శిక్షణలు ఇచ్చిన తర్వాత మాత్రమే విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం కాకముందే కార్పొరేట్ సంస్థలు కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని, కొన్ని కార్పొరేట్ సంస్థలు రహస్యంగా గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
మరికొన్ని సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పదవీ విరమణ వయసు పెంచాలి
ముఖ్యమంత్రి ఈ సమస్యపై ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని రోహిత్ నాయక్ కోరారు. కరోనా వైరస్ నేపాథ్యంలో అన్ని తరగతుల సిలబస్ ను సగానికి పైగా కుదించాలని, ఎఫ్.ఎ పరీక్షలు రద్దు చేయాలని, ఈ ఏడాది సిసిఇ అమలు రద్దు చేయాలని, దసరా, సంక్రాంతి పండుగల టెర్మినల్ సెలవులు పూర్తిగా రద్దు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ 2018 జులై నెల నుంచి నగదు రూపంలో పి.ఆర్.సి ని 63% ఫిట్మెంట్ ను కల్పిస్తూ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు ను జాతీయ విద్యా కమిషన్ ల నివేదికల ప్రకారం 65 సంవత్సరాలకు పెంచుతూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.
న్యాయవ్యవస్థ తలుపుతడతాం
విద్యా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రాథమిక ఉపాధ్యాయుల జీతాలు చెల్లించే బాధ్యతలను ఎంఇఓ ల నుండి తొలగించి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు మారుస్తూ జారీ చేసిన అసంబద్ధ ఉత్తర్వులను రద్దు చేయని పక్షంలో న్యాయ వ్యవస్థ తలుపులు తట్టడమే ఏకైక మార్గం అని ఆయన తెలిపారు. ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధం మరియు అమానుషం అని ఆయన తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీవర్ధన్ రెడ్డి, గులాం అహ్మద్, ఎం. భీముడు, రాష్ట్ర కార్యదర్శి ఎ శివరాం ప్రసాద్, ఇంచార్జీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ పటేల్, జిల్లా నాయకులు నాయకులు తదితరులు ప్రసంగించారు. అనంతరం సమావేశం పలు తీర్మానాలు ఆమోదించింది.